Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు లంచం.. సర్వేయర్ సస్పెండ్!!

chandrababu

వరుణ్

, మంగళవారం, 2 జులై 2024 (15:03 IST)
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి ఆ సర్వేయర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 
 
గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు తెలుగుదేశం నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు ఇచ్చారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో దస్త్రం ముందుకు కదిలింది. 
 
గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. 
 
భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ.లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి.. అది కూడా నిజమేనని నిర్ధారించారు. ఈ అంశాలపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఘటన స్థానికంగా రెవెన్యూ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతి మిస్సింగ్ కేసు.. పవన్ జోక్యంతో చేధించారు.. జమ్మూలో 9 నెలల తర్వాత?