Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు: హమ్మ! జగన్ ని దీపక్ రెడ్డి ఎంత మాటనేశాడూ?

తన్నే దున్నపోతుని తెచ్చుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారు: హమ్మ! జగన్ ని దీపక్ రెడ్డి ఎంత మాటనేశాడూ?
, మంగళవారం, 24 నవంబరు 2020 (07:35 IST)
‘నేను ఉన్నాను.... నేనువిన్నాను...’ ఒక్కఛాన్స్ అంటూ నవరత్నాల పేరుచెబుతూ, ప్రజలకు ముద్దులుపెట్టుకుంటూ, 400లకు పైగాహామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు ప్రజలను నిలువునా మోసగించాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి దీపక్ రెడ్డి స్పష్టంచేశారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడా రు. విభజనానంతర రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ప్రజలకు మెరుగైన భవిష్యత్ అందించడానికి 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషిచేస్తే, ఆయనచేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలకు తాముఏవిధంగానూ సరిపోమని భావించిన వైసీపీనేతలు,  జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంకోసం ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీని నియమించడం జరిగిందని దీపక్ రెడ్డి పేర్కొన్నారు.

ఆ కన్సల్టెన్సీసంస్థ, ఓటర్లనుఎలా మోసగించాలనే దిశగా ఆలోచనలు చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతాలవారీగా ఓటర్లను విభజించి, వారిభావోద్వేగాలను రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకునేక్రమంలో వైసీపీఅధినేత పాదయాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో లోపాయికారీ ఒప్పందంచేసుకొని, చంద్రబాబుదెబ్బకు గెలవలేమని భావించి, చివరకు ఈవీఎంలతో విజయం సాధించడం జరిగిందని దీపక్  రెడ్డి తెలిపారు.

వైసీపీకోసం పనిచేసిన కన్సల్టెన్సీ ఏజెన్సీలతో మాట్లాడటం జరిగిందని, వారంతా 70శాతానికి పైగా ప్రజలు ఒక్కఛాన్స్ ఇచ్చిచూద్దామనే భావనతోనే ఓట్లువేశారని సదరు సంస్థలు చెప్పడం జరిగిందన్నా రు.  జగన్మోహన్ రెడ్డిపై ప్రేమగానీ, చంద్రబాబునాయుడిపై వ్యతిరేకత గానీలేదని, కేవలం ఒక్కఛాన్స్ అన్నమాటే ప్రభావం చూపిందన్నారు.

ఆ ఒక్కఛాన్స్ తో 150కుపైగా సీట్లుసాధించి  అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడాలేని అహంకారం, పొగరుతో విర్రవీగుతోందన్నారు. ఏనుగుల గుంపు గ్రామాలపై పడి, ఎలా సర్వనాశనం చేస్తాయో, అదేమాదిరి వైసీపీనేతలు, వారిముసుగులో ఉండేరౌడీలు, గూండాలు,  రాష్ట్రప్రజలపై పడి, అరాచకాలు సృష్టిస్తున్నారని దీపక్ రెడ్డిమండిపడ్డారు.

రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంటూ, ఎన్నడూలేనివిధంగా కొత్తకొత్త విధానాలను అమలుచేస్తున్నారన్నారు.  శాంతిభద్రతల వైఫల్యంలో అగ్రస్థానం, అప్పుల్లో తొలిస్థానం, రైతుఆత్మహత్యల్లో పైస్థానంతో రాష్ట్రం సరికొత్తగా ముందుకెళుతోందని దీపక్ రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రం రంగు నీలమైతే, రాష్ట్రభాష బూతులని, రాష్ట్రవాహనంగా జేసీబీ నిలిచిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వహాబీ కూల్చివేతలైతే, రాష్ట్రప్రభుత్వ క్రీడ రాక్షసక్రీడ అయ్యిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగమైతే, పాలనా విధానం మొత్తం అక్రమకేసులు పెట్టి జైళ్లకు పంపడంగా మారిందన్నారు. అంతిమంగా ఆంధ్రరాష్ట్ర సిద్ధాంతం పొలిటికల్ టెర్రరిజంగా మారిందని దీపక్ రెడ్డి తెలిపారు.

ప్రత్యేకహోదా తెస్తారని, 13 జిల్లాలను 13 రాజధానుల్లా మారుస్తారని, నమ్మే ప్రజలు అధికారపార్టీకి 28ఎంపీలను ఇచ్చారని, వారంతా 18నెలలనుంచి ఒక్క అడుగుకూడా వేయకుండా ఎక్కడివారక్కడే విగ్రహాల్లా నిలబడిపోయారన్నారు.  ప్రతికుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షలవరకు లబ్ధిచేకూరుస్తామని చెప్పారని, ఆ విధంగా ఎన్నికుటుంబాలకు ఇచ్చారో సమాధానం చెప్పాలని దీపక్ రెడ్డి నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వంరాగానే పోలవరం ప్రాజెక్ట్ సహా, నిర్మాణంలో ఉన్న 40కుపైగా  సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసిందని, దానివల్ల ఏపీకి రూ.50వేలకోట్ల వరకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పిన వారు, ఇప్పుడు మూడురాజధానుల పేరుతో వికృతక్రీడ ఆడుతున్నారన్నారు.

పింఛన్ రూ.3వేలు  చేస్తాననిచెప్పడం,  45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు రూ. పింఛన్ ఇస్తాననడం, ఏటా 5లక్షలఇళ్లు నిర్మిస్తామని చెప్పడం, వంటిహామీలన్నీ ఏమయ్యాయో పాలకులు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీప్రభుత్వం అమలుచేసిన పథకాల్లో దాదాపు 35కుపైగా రద్దచేశారని, వాటిని రద్దుచేస్తామని ఎన్నికలముందే చెప్పిఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజలు ఒక్కఛాన్స్ ఇచ్చేవారు కాదన్నారు.

రూ.5కు అన్నంపెట్టే అన్నక్యాంటీన్లు కూడా మూసేశారన్నారు. రైతరాజ్యమంటూ, రైతుభరోసాపేరుతో అన్నదాతలను మోసగించా రని, రాష్ట్రంలో 70 లక్షలమందికిపైగా రైతులుంటే, బడ్జెట్లో  ఆ సంఖ్యను 64లక్షలకే కుదించి, అంతిమంగా 45లక్షలమంది రైతులకే కేంద్రమిచ్చే రూ.6,500 సొమ్ముతోకలిపి రైతుభరోసాను అమలు చేశారన్నారు.

టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3లక్షల వరకు రైతు బ్యాంకురుణంతీసుకుంటే,  వడ్డీకేవలం రూ.6వేలు అయ్యేదని, అదే రైతుఇప్పుడు రూ.12వేలవరకు వడ్డీ కడుతున్నా డన్నారు. 64లక్షలమందికి సున్నావడ్డీ అమలుచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాడని, నేడు ఆ సంఖ్యను 14 లక్షలకే  పరిమితంచేశారన్నారు. 

ఈ విధంగా అడుగడుగునా రైతులను మోసగించిన ఘనత వైసీపీప్రభుత్వాని దేనని, ఈ ప్రభుత్వ నిర్వాకాల కారణంగానే రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందన్నారు. మద్యనిషేధం పేరుతో కల్తీమద్యాన్ని మూడురెట్లవరకు ధరపెంచి అమ్ముతున్నారన్నారు.

ఎస్సీ,ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామనిచెప్పిన వారు అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచార న్నారు. టీడీపీ ప్రభుత్వహయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ.8,400కోట్లు ఖర్చుచేస్తే, ఈప్రభుత్వం వచ్చాక దళితులకు అందుతున్న అన్నిపథకాలను రద్దుచేసి, సబ్ ప్లాన్ కింద రూ.4,300కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని దీపక్ రెడ్డి వివరించారు. 

బీసీరిజర్వేషన్లు తగ్గించేసి, దాదాపు 16,800 పదవులు ఆయావర్గాలకు దక్కకుండా చేసిన ఘనులుకూడా అధికారపార్టీవారేనన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చుతామని చెప్పినవారు ఇంతవరకు ఆఊసే ఎత్తడం లేదన్నారు. ఏటా లక్షా 40వేల ఉద్యోగాలిస్తామని చెప్పినవారు, ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నారన్నారు. డీఎస్సీ అమలుచేయకపోగా, గతప్రభుత్వం 7లక్షలమందికి నిరుద్యోగభృతి ఇస్తుంటే, దాన్నికూడా రద్దుచేసేశారన్నారు.

అధికారంలోకి వచ్చిన వారంలోనే ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తామనిచెప్పి, ఏడాదిన్నర అయినా దానిగురించి మాట్లాడటంలేదన్నారు.  పీఆర్సీ సంగతి చెప్పాల్సిన పనిలేదన్నారు. చివరకు ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా నెలనెలా ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతున్నారన్నారు. 

ఇవన్నీ ఇలాఉంటే, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యివసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ – డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసి ప్రజలపై అదనపు భారం మోపారన్నారు. రోడ్లపై టోల్ ట్యాక్సులు కూడా పెంచేసి, ప్రజలనుంచి అనేకరూపాల్లో దోచుకునే క్రతువుని వైసీపీప్రభుత్వం యథేచ్ఛగా కొనసాగిస్తోందన్నారు.

ప్రభుత్వం ఒక కుటుంబానికి రూ.50వేలిస్తే, పన్నులరూపంలో, పెంచినధరల రూపంలో అదేకుటుంబంనుంచి రూ.70వేలవరకు వసూలుచేస్తోందని ఒకసర్వే సంస్థచెప్పిన మాటలు అక్షరసత్యాలని దీపక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చేదానికంటే, వారినుంచి 40శాతం వరకు అదనంగానే వైసీపీప్రభుత్వం దండుకుంటోందన్నారు.

పాలిచ్చే ఆవుని కాదని, తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్లుగా ఏపీ ప్రజల పరిస్థితి తయారైందన్న దీపక్ రెడ్డి, ఈప్రభుత్వం 90శాతంహామీలు నెరవేర్చినట్లగా చెబుతూ, ప్రజలను నమ్మించడానికి కొత్తరకం కుట్రలుచేస్తోందన్నారు.  ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన 400లకు  పైగా హామీలుకాదని, కేవలం నవరత్నాల పేరుతో ప్రజలను నమ్మించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఇటువంటి పనులు చేసి, తమను మోసగిస్తారని ప్రజలు భావిస్తే, ఇప్పుడున్న వారికి ఒక్కఛాన్స్ ఇచ్చేవారు కాదన్నారు.   యువజనశ్రామిక రైతుపార్టీ పాలనలో యువజనులు ఈసురోమంటుంటే, శ్రామికులను పాలకులే దోపిడీ చేస్తున్నారని, ఇక రైతుల పరిస్థితి చెప్పుకోలేనివిధంగా తయారైంద ని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు.

పార్టీ పేరులో ఉన్న మూడువర్గాలకే న్యాయం చేయలేనివారు, ప్రజలకేం చేస్తారని టీడీపీనేత నిలదీశారు. వైసీపీ హామీలను, వైఫల్యాలను నిలదీశానన్న అక్కకసుతో, తనపై బూతుల పురాణం మొదలెడతారని, కొడాలినానీ లాంటివారు బయటకు వచ్చి, ఎవడమ్మ మొగుడు చెప్పాడు ఇవన్నీ చేస్తామని అని అడిగినా ఆశ్చర్యంలేదన్నారు.

మంత్రులు అలా దబాయించి, బూతులు మాట్లాడతారనే, జగన్ పాదయాత్రలో ఏం చెప్పాడు.. అధికారంలోకి వచ్చాక ఏంచెప్పి, ఏంచేస్తున్నాడనేది ప్రజలకు తెలియచేయడానికి ఆధారాలతో సహ  తమదగ్గర పెట్టుకున్నామని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. 

వైసీపీ నేతలు, మంత్రులు ఎవరైనా సరే, వారికి దమ్ము, ధైర్యముంటే, తాముసూచించినవి ఎంతవరకు అమలుచేశారో బహిరంగంగా ప్రజలముందుకొచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఒక్కఛాన్స్ ఇచ్చిన ప్రజలంతా కూడా ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని దీపక్ రెడ్డి సూచించారు.

ప్రజల బాధ్యత పాలకులను నిలదీయడమని, వారు ఆపనిచేయకుంటే, పాలకులు మరింత పేట్రేగిపోతారన్నారు. టీడీపీ ఎప్పుడూ ప్రజలకు అండగానే ఉంటుందని, వారు రాష్ట్రపాలకులను ఎదిరించాల్సిన సమయం వచ్చిందని దీపక్ రెడ్డి తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం .. సహకార వ్యవస్ధ కీలక పాత్ర: ఏపి గవర్నర్