బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. ఇది మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది.
ఈ వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారితే దానికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలు, యానాంలో ఈ నెల 29వ తేదీన భారీ వర్షాలు, 30వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, ఈ నెల 27, 28వ తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది.
తమిళనాడులో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇదిలావుంటే, కొమోరిన్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదని వాతావరణ శాఖ హెచ్చరించింది.