Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ ఎన్నికలకు వెళ్దాం.. మీరు గెలిస్తే ఎక్కడైనా పెట్టుకోండి.. జగన్‌కు సవాల్

మళ్లీ ఎన్నికలకు వెళ్దాం.. మీరు గెలిస్తే ఎక్కడైనా పెట్టుకోండి.. జగన్‌కు సవాల్
, శనివారం, 28 డిశెంబరు 2019 (09:24 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ జాతీయ సభ్యుడు కె. నారాయణ ఒక సవాల్ విసిరారు. రాజధాని మార్పు అంశంపైనే ఆయన ఈ సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశంపై ఎన్నికలకు వెళ్దాం. అపుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే.. ఖచ్చితంగా ఆయనకు నచ్చిన చోట రాజధానిని పెట్టుకోవచ్చు. అప్పటివరకు రాజధానిని ముట్టుకోవద్దు అంటూ అన్నారు. 
 
రాజధానిని తరలించడాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు సీపీఐ నేత నారాయణను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
రాజధానిని అమరావతిలోనే యధావిధిగా కొనసాగించాలన్న రైతుల కోరికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాజధాని మార్పు అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. రాజధాని అమరావతికి ప్రతిపక్ష నేతగా నాడు మద్దతు చెప్పిన జగన్ ఈరోజున ఎందుకు కాదంటున్నారు? "ఒకసారి మాట ఇస్తే తప్పరు కదా?" అంటూ ప్రశ్నించారు. 
 
రాజధాని అమరావతిని తరలిస్తామని వైసీపీ ఎన్నికల ప్రచారంలో కానీ, మేనిఫెస్టోలో గానీ చెప్పలేదని అన్నారు. అధికారంలోకి రాగానే ఇలాంటి ఆలోచన చేయడం సబబు కాదని, దీనికి ప్రజల ఆమోదం లేదని అన్నారు. ఒకవేళ రాజధానిని తరలించాలని అనుకుంటే కనుక జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
 
మళ్లీ ఎన్నికలకు వెళదామని, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న నినాదంతో ప్రచారానికి వెళ్లి ‘మీరు కనుక గెలిస్తే అప్పుడు రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం’ అని అన్నారు. అయితే, అప్పటిదాకా అమరావతిని తాకొద్దని, రాజధానిని తరలించాలన్న ఆలోచన చేయొద్దని హెచ్చరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రాంతంగా ఉన్న ప్రాంతంలో రాజధాని ఉందని, అక్కడి నుంచి తరలించాలని అనుకోవడం సరైన ఆలోచన కాదని, కక్షపూరితంగా వ్యవహరించొద్దని నారాయణ హితవు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో దుర్యోదనుడు, దుశ్శాసనుడు: యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు