Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో కో ఆపరేటివ్, పీఏసీఎస్ హెచ్ఆర్ పాలసీ: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

త్వరలో కో ఆపరేటివ్, పీఏసీఎస్ హెచ్ఆర్ పాలసీ: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
, శుక్రవారం, 26 మార్చి 2021 (20:02 IST)
కో ఆపరేటివ్ బ్యాంకింగ్, పీఎసీఎస్ బ్యాంకు ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరనుంది. హెచ్ఆర్ పాలసీ అమలు చేయనుండడంతో ఆ బ్యాంకు ఉద్యోగులకు బదిలీ సదుపాయం కలుగనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

విద్యా రంగంలో మాదిరిగా మార్కెట్ యార్డులను నాడు-నేడు పథకంతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. రెండు ఫేజ్ ల్లో రూ.500 కోట్లు వెచ్చించనున్నామన్నారు. రాష్ట్రంలో రూ.2,900 కోట్లతో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చొప్పున్న 25 యూనిట్లు నెలకొల్పనున్నట్లు మంత్రి తెలిపారు.

2.31 లక్షల కోట్ల రుణ అంచనాలతో నాబార్డుకు క్రెడిట్ ప్రొజెక్షన్ అందజేశామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్స్యూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసా కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ధరల స్ఠిరీకరణ నిధుల ఏర్పాటు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తూ రైతాంగానికి ముఖ్యమంత్రి అండగా నిలిచారన్నారు. రైతు సంక్షేమంలో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.

3 వేల కోట్లతో ధరల స్ఠిరీకరణ నిధులు ఏర్పాటు చేసినా, 4,700 కోట్లకు పైగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. మొట్టమొదటి సారిగా రైతులను పొగాకు కొనుగోలు చేశామన్నారు. రైతుల విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లకూడదనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు.

నాబార్డు అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో స్టేట్ ఫోకస్ పేపర్ 2021-22 ఆవిష్కరించామన్నారు. దీనిలో భాగంగా 2.31 లక్షల రుణ అంచనాలతో నాబార్డుకు క్రెడిట్ ప్రొజెక్షన్ అందజేశామన్నారు. ఇందులో వ్యవసాయరంగానికి రూ.1.57 లక్షల కోట్ల సాయమందించాలని కోరామన్నారు.

టెర్మ్ రుణాలు ఇతర అవసరాల కోసం రూ.31,805 కోట్లు, పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం 1.13 లక్షల కోట్లు వినియోగించనున్నట్లు ఆ అంచనా రిపోర్టులో పేర్కొన్నామన్నారు. ఇది గతేడాది కంటే 9 శాతం అధికమన్నారు. దేశ వ్యాప్తంగా 16,5 లక్షల కోట్లతో అంచనాలు రూపొందిస్తే, అందులో ఏపీ వాటా 9.8 శాతం అంటే రూ.158 లక్షల కోట్లు అని తెలిపారు.

కౌలు రైతులకు రుణాలివ్వడంలో బ్యాంకులు ముందుకు రావడంలేదని నాబార్డు అధికారులతో జరిగిన సమావేశం తెలిపారు. కౌలు రైతులకు రుణాలివ్వాల్సిందేనని స్పష్టం చేశామన్నారు. 

రూ.2,900 కోట్లతో 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు....
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను నెలకొల్పనునట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇందుకోసం రూ.2,900 కోట్లు వెచ్చించనున్నామన్నారు. ఇందులో రూ.1300 కోట్లు నాబార్డు నిధులు వినియోగించనున్నటలు మంత్రి వెల్లడించారు.

ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు, గ్రేడింగ్ సెంటర్లు, టెస్టింగ్ ల్యాబ్ లు వంటి మౌలిక సదుపాయలు కల్పించనున్నామన్నారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. 

కో ఆపరేటివ్, పీఏసీఎస్ ఉద్యోగులకు బదిలీ సదుపాయం...
కో ఆపరేటివ్, పీఏసీఎస్ వ్యవస్థలను సంస్కరించనున్నట్లు ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు. నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాబ్కాన్స్ ద్వారా కో అపరేటివ్, పీఏసీఎస్ వ్యవస్థల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి...వాటిని ఉన్నత స్థితిలో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

దీనిలో భాగం హెచ్ ఆర్ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. కో ఆపరేటివ్, పీఏసీఎస్ బ్యాంకుల్లో ఉద్యోగిగా నియమితులైన నాటి నుంచి రిటైర్మెంటయ్యే వరకూ ఒకే ప్రాంతాంలో పనిచేస్తున్నారన్నారు. హెచ్ ఆర్ పాలసీ అమలుతో కో అపరేటివ్, పీఏసీఎస్ బ్యాంకు ఉద్యోగులు  ఒక బ్యాంకు నుంచి వేరే ప్రాంతంలో ఉన్న బ్యాంకు బదిలీ కావొచ్చునన్నారు.

హెచ్ ఆర్ పాలసీ కో అపరేటివ్ ఉద్యోగులకు ఎంతో లబ్ధి కలిగిస్తుందన్నారు. కో ఆపరేటివ్, పీఏసీఎస్ బ్యాంకుల అభివృద్ధికి నిపుణులను ఎక్స్ అపిషియో డైరెక్టర్లగా నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 

మార్కెట్ యార్డుల్లో నాడు-నేడు...
విద్య, వైద్య రంగాల మాదిరిగా మార్కెట్ యార్డుల్లోనూ నాడు-నేడు పనులు చేపట్టనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రూ.500 కోట్లతో రెండు దశల్లో మార్కెట్ యార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. మొదటి దశలో రూ.212 కోట్లు వెచ్చించనున్నామన్నారు.

తానున్న ప్రాంతం నుంచే పంటలను విక్రయం చేసుకునే సదుపాయం రైతుకు కల్పించనున్నామన్నారు. ఈ - ప్లాట్ ఫాం ద్వారా పండించిన పంటను నచ్చిన ధరకు రైతు విక్రయించుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. ఆర్బీకే కేంద్రాలను పంటల కొనుగోలు కేంద్రాలుగా వినియోగించనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్ : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్