Publish Date: Mon, 30 Jan 2023 (16:13 IST)
Updated Date: Mon, 30 Jan 2023 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదేసమయంలో అధికార వైకాపా మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. దీనిపై ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు క్లారిటీ ఇచ్చారు.
పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జగనన్న చేదుడో వాదోడు పథకం కింద అర్హులైన లబ్దిదారులకు నగదు పింపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, తాను ఎవరినీ నమ్మనని, తనకు పొత్తులు లేవని స్పష్టం చేశారు. దేవుడి దయ, అందరి దీవెనలే తన ఆస్తి అని అన్నారు.
తోడేళ్లు ఒకే చోట గుమిగూడుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒంటరిగా ఎదురు చూస్తున్నా.. ఇంకా ఎలాంటి భయం కనబరచకుండా.. రాష్ట్ర ప్రజలపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగడమే ఇందుకు కారణమని జగన్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో మరోమారు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు. తనకు మేలు చేసేలా మరిన్ని అవకాశాలు కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా అని జగన్ వ్యాఖ్యానించారు.