మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య కాలేజీలు నిర్మించారని ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారునీ, ఆయన కట్టిన వైద్య కాలేజీలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే కాస్త చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర 2024 విజన్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ మెడికల్ కాలేజీలు కట్టకుండా... కట్టేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రైవేట్ వారికి అప్పగించడం లేదని.. పీపీపీ పద్దతిలోనే చేపడుతున్నామన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు.
వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. ఒకప్పుడు రాయలసీమలో పదేళ్లలో 8 ఏళ్లు కరవు ఉండేదన్నారు. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం.. కానీ నీళ్లు ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందన్నారు.
గోదావరి జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో అగ్రస్థానంలో ఉందన్నారు. హర్టీకల్చర్ సాగు వల్లే ఇది సాధ్యమైందని గుర్తుచేశారు. వృథా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యమని, ఇందుకోసం ఒక బృహత్తరమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.