మెగాస్టార్ చిరంజీవి మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ ఈ విరాళాన్ని అందించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. చిరంజీవి అందించిన సాయం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి ఎపుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం అని చంద్రబాబు అన్నారు.
ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ సేవాగుణాన్ని అభినందిస్తూ ఆయన అభిమానులు, చిరు రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవలతో ఎందరికో అండగా నిలుస్తున్న విషయం తెల్సిందే. ఈ విరాళం ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.