Publish Date: Fri, 14 Jan 2022 (17:10 IST)
Updated Date: Fri, 14 Jan 2022 (17:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మరోమారు రాజ్యసభ్యుడు పదవిని చేపట్టబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలు సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి గురువారం లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు అంశం ప్రధానంగా ఉన్నప్పటికీ ఇతర అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా వారిద్దరు చర్చించినట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో చిరంజీవి రాజ్యసభ సీటును కేటాయించబోతున్నట్టు తెలుగు మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. వీటిపై చిరంజీవి గన్నవరం విమానాశ్రంయలో స్పందించారు. తాను మరోమారు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాను రాజకీయాలకు దూరమయ్యాయని చెప్పారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు అలాంటి అవకాశాలు ఎలా వస్తాయని చిరంజీవి ఎదురు ప్రశ్నించారు. పైగా, తాను కూడా అలాంటి అవకాశాలు కోరుకోవడం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.
అయితే, ఈ తరహా ప్రచారం సాగడం వెనుక ఓ కారణం లేకపోలేదు. ఏపీ నుంచి త్వరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు కానున్నాయి. ఈ నాలుగు కూడా అధికార వైకాపా ఖాతాలోకి వెళ్లనున్నాయి. వీటిలో ఒకటి సీటును చిరంజీవి కేటాయించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.