Publish Date: Fri, 24 Jan 2020 (19:00 IST)
Updated Date: Fri, 24 Jan 2020 (19:02 IST)
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, తాను ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండ్రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు.
సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని, తప్పును కప్పిపుచ్చుకునేలా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లుపై చర్చకు సమయం కూడా ఇవ్వలేదని, అసెంబ్లీలో కనీసం ప్రతిపక్షానికి సమయం ఇవ్వలేదని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు మైక్ ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు.
మండలి చైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి గుర్తుచేశారు. వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, సభలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా దాడి చేశారని ఆయన నిప్పులు చెరిగారు. తమను బయటపడేయాలని సీఎం జగన్, స్పీకర్కు చెప్పాడని ఆరోపించారు. ముఖ్యమైన బిల్లుపై లాభనష్టాలు చెప్పడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
జగన్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్ జగన్.. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
ఇందుకోసం రచ్చబండ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశం.