Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలేజీ ఫీజు చెల్లించలేక... బీటెక్ విద్యార్థిని సూసైడ్ - బాబు, పవన్ ఆవేదన

కాలేజీ ఫీజు చెల్లించలేక... బీటెక్ విద్యార్థిని సూసైడ్ - బాబు, పవన్ ఆవేదన
, ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (10:19 IST)
కాలేజీ ఫీజు చెల్లించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. ప్రభుత్వం గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల ఫీజులు చెల్లించే స్థోమత లేక, తల్లిదండ్రుల దీనావస్థ చూడలేక.. మనస్తాపానికి గురైన బీటెక్‌ విద్యార్థిని బలవంతంగా తనువు చాలించింది. కన్నవారికి భారం కావడం ఇష్టంలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ప్రకాశం జిల్లా ఒంగోలులోని గొడుగుపాలెంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఒంగోలులో బంగారం పనులు చేసుకునే పాపిశెట్టి నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. చిన్న కుమార్తె పి తేజశ్రీ (20) స్థానిక క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోంది. 
 
రెండేళ్లుగా ఆ కళాశాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యం ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫీజు చెల్లించడం కోసం తేజశ్రీ తండ్రి నాగేశ్వరరావు అధిక వడ్డీకి అప్పులు చేశారు. విషయం తెలుసుకున్న తేజశ్రీ మానసిక వేదనకు గురైంది. తల్లిదండ్రులకు తాను ఆర్థిక భారం కాకూడదని భావించి శుక్రవారం రాత్రి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
గమనించిన తండ్రి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఒంగోలులో ఓ విద్యార్థిని బలవన్మరణం చెందిందన్న వార్తపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. ఒంగోలులో బీటెక్ చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని కాలేజీ ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుందన్న వార్త తన మనసును కలచివేసిందని తెలిపారు. 
 
ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం అని తెలిపారు. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైందని చంద్రబాబు నిలదీశారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. వెంటనే విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
 
అలాగే, జనసేన అధినేత పవన్ స్పందిస్తూ, ఫీజుల బకాయిల వల్ల పరీక్షలు రాయలేని పరిస్థితిలో బీటెక్‌ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందన్నారు. ప్రభుత్వం పేదలను చదువులకు దూరం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఏపీఎస్ ఆర్టీసీ టిక్కెట్లు.. ఎందుకు.. ఎలా?