Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా నేతలపై చర్యలకు వెనుకాడుతున్న ముఖేశ్ కుమార్ మీనా : బోండా ఉమ

bonda uma

ఠాగూర్

, సోమవారం, 6 మే 2024 (18:19 IST)
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెనుకంజ వేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని ఆయన పేర్కొన్నారు. 
 
ఎన్నికల నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘన, తప్పులు చేసే వైకాపా నేతలపై చర్యలు తీసుకునేందుకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న చొరవ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేకపోవడం వెనుక మర్మం ఏమిటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
'వెల్లంపల్లి శ్రీనివాస్‌ పోస్టింగ్‌ వేయించాడని విజయవాడ నార్త్‌ ఏసీపీ ప్రసాద్‌, నున్న సీఐ దుర్గాప్రసాద్‌లు వైకాపా తొత్తులుగా పనిచేస్తున్నారు. తను చెప్పినట్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయలేదని ఎస్టీ సర్వేయర్‌పై వైకాపా కార్పొరేటర్‌ గణేశ్‌ భర్త దాడి చేయించాడు. ఈ ఘటనలో వైకాపా నేతల మీద నామమాత్రపు కేసులు పెట్టి, బాధితులపైనా ఎదురు కేసులు నమోదు చేశారు. 
 
గతంలో సదురు అధికారులపై ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలి. అధికార పార్టీ పట్ల అంత మెతక వైఖరి దేనికో బహిర్గతం చేయాలి అని బొండా ఉమా డిమాండ్‌ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు. ఇద్దరు అధికారుల బాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, కొత్త డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా
 
ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. 
 
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీవేటు
 
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. 
 
కాగా, ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించనుంది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికార వైకాపాకు అంటకాగుతున్న పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కారు చేసే పని జీరో... అవినీతి మాత్రం 100శాతం.. మోదీ