Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొత్తుపై పవన్ ప్రకటన... బీజేపీ నేతల్లో గుబులు - - ఒక్క సీటు రాదంటూ నేతల సమాధానం

bjp flags
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:27 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ రాజమండ్రి సెంట్రల్ జైలు బయట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో భారతీయ జనతా పార్టీ నేతలు సైతం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈ ప్రకటన వారిలో గుబులు రేపింది. ఇంత అనూహ్యంగా ఆయన ఏకపక్ష ప్రకటన చేస్తారని కమలం పార్టీకి చెందిన జాతీయ స్థాయి నేతలు సైతం అంచనాలు వేయలేదు. జాతీయ మీడియాలో పవన్ వ్యాఖ్యలు చూసిన వెంటనే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు వరుసగా ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. 
 
జనసేన అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పందన ఎలా ఉందని ఆరాతీశారు. టీడీపీ, జనసేన శ్రేణుల్లో సంతోషం కనిపిస్తోందని, బీజేపీ కేడరులో కూడా సానుకూలతే కనిపిస్తోందని వారు బదులిచ్చినట్లు తెలిసింది. ఇదేసమయంలో కేంద్ర నిఘావర్గాలు, ఏపీ విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే ఏజెన్సీలను సైతం సంప్రదించినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ ప్రజల్లో బాగా మార్పు వచ్చిందని అవి చెప్పినట్టు తెలిసింది. 
 
ప్రజల్లో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉందనే సమాచారం కేంద్ర బీజేపీ పెద్దలకు చేరడంతో ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ఖండించిన రాష్ట్ర బీజేపీ, ఆ తర్వాత మౌనం వహించింది. ఇదేసమయంలో చంద్రబాబును జైలుకు పంపిన జగన్, ఒక్క మాటైనా ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పకుండా చేసి ఉంటారా అనే చర్చ అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. 
 
టీడీపీ బంద్‌కు జనసేన మద్దతిస్తే కమలం కలిసి రాలేదు. జగన్ ప్రభుత్వం పంచాయతీల నిధులు మళ్లించడంపై ఇటీవలే ఉమ్మడిగా బీజేపీ, జనసేన ఉద్యమించాయి. నెల తిరగకుండానే చోటుచేసుకున్న ఈ పరిణామం కమలం శ్రేణులను గందరగోళంలోకి నెట్టింది. గురువారం రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పవన్ పరామర్శించారు. బయటికి వచ్చిన తర్వాత లోకేశ్ సమక్షంలో టీడీపీతో పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. దీనిపై ఉలిక్కిపడిన బీజేపీ నేతలు జిల్లాల్లోని తమ పార్టీ కేడర్‌కు ఫోన్లు చేసి పవన్ వ్యాఖ్యలపై ప్రజల్లో స్పందన ఏంటని అడిగారు. 
 
సానుకూలంగా ఉందని మెజారిటీ బీజేపీ శ్రేణులు తెలిపాయి. పవన్ పూర్తిగా దూరమైతే బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికీ బలోపేతం కాబోదని వారు ప్రాయపడినట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు 'మీ ఢిల్లీ పెద్దల సపోర్ట్ లేకుండానే జగన్ ఇన్ని అరాచకాలు చేస్తున్నాడా? నెల్లూరులో జిల్లా బీజేపీ నాయకుడిపై పోలీసుల దౌర్జన్యం, ధర్మవరంలో బీజేపీ కార్యాలయంలోకి చొరపడి విధ్వంసం సృష్టించడం, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో దాడి, ఆదినారాయణ రెడ్డి లేడా అంటూ వెతకడం... ఇలా పార్టీ నేతలపై జగన్ దాడులు చేయిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఢిల్లీ నుంచి మద్దతు లభించడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. 
 
ఒక జిల్లా స్థాయి నాయకుడు మాట్లాడుతూ 'మా పార్టీ సిద్ధాంతం సనాతన ధర్మం.. హిందూ ఆలయాలపై దాడులు చేయించే వ్యక్తి వెంకటేశ్వరుడి ప్రతిమ ఇవ్వగానే మద్దతివ్వడం, ఇదేం రాజకీయం? ఏపీ ప్రజలు అంత అమాయకులా?' అని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేయడంతో వైసీపీతో సఖ్యతగా ఉన్న నలుగురు నాయకులు తప్ప మిగతా అందరూ సానుకూలంగానే ఉందంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు త్వరలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ దూరమైతే... ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదట...