Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృగాలపై కానరాని సానుభూతి!

మృగాలపై కానరాని సానుభూతి!
, శనివారం, 7 డిశెంబరు 2019 (09:04 IST)
'దిశ' కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ దీనిపైనే చర్చ. దిశకు న్యాయం జరిగిందంటూ సామాజిక మాధ్యమ వేదికగా పోస్టింగ్​లు..

మృగాలకు సరైన శిక్ష వేశారంటూ పోలీసులకు జేజేలు. నిందితుల పట్ల వారి కుటుంబ సభ్యులు మినహా ఏ ఒక్కరూ కూడా కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదంటే.. పాశవిక దాడిపట్ల ప్రజలు ఎంత భావోద్వేగానికి గురయ్యారో తెలుస్తోంది. దిశ పాశవిక హత్యాచార ఘటన.. దేశవ్యాప్తంగా అన్ని దిక్కుల ప్రజలను కదిలించింది.

ప్రతి హృదయాన్ని స్పందించేలా చేసింది. అమ్మాయిని కాపాడలేకపోయారని పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని.. లేదా తమకు అప్పగించాలని అన్ని వర్గాల వారు డిమాండ్​ చేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. పోలీస్​ స్టేషన్​లోకి చొచ్చుకుపోయేందుకు వెనుకాడలేదు.

ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడిన క్షణాలవి.. అయితే ఎన్​కౌంటర్​ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడుగడుగునా పోలీసులకు ప్రజలు నీరాజనం పలికారు. రాళ్లు వేసిన చేతులతోనే పూల వర్షం కురిపించారు. ఘటనా స్థలంలో నిందితులు విగత జీవులుగా పడి ఉన్న కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వారిపై సానుభూతి వ్యక్తం చేయలేదు.

కారణం వారి క్రూరత్వమే. గతం కంటే భిన్నం.. సాధారణంగా ఎక్కడ ఎన్​కౌంటర్​ జరిగినా.. ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు పెద్దఎత్తున నిరసన తెలుపుతారు. ప్రభుత్వం, పోలీసులపై ఆరోపణలు చేస్తారు. దిశ నిందితుల విషయంలో మాత్రం కనీసం పాపం అన్న వారే కనిపించలేదు.

కొన్ని న్యాయపరమైన ప్రశ్నలు మినహా.. సర్వత్రా ప్రజామోదం లభించింది. ఎన్​కౌంటర్​ జరిగిన ప్రాంతానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు పోలీసులపై పూలవర్షం కురిపించారు. పోలీసులు హాట్సాఫ్​ అంటూ జిందాబాద్​ కొట్టారు. దిశకు న్యాయం జరిగిందంటూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా సామాజిక మాధ్యమ వేదికగా గొంతెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధానిపై ఈ నెల 20-25 మధ్య ప్రభుత్వానికి నివేదిక?