Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2020 హజ్ యాత్రకు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.. ఉప‌ముఖ్యమంత్రి

2020 హజ్ యాత్రకు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.. ఉప‌ముఖ్యమంత్రి
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (07:03 IST)
మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రూ.60వేలు, ఆపై ఆదాయం ఉన్నవారికి రూ.30 వేలు హజ్ యాత్ర సందర్భంగా ఆర్ధిక సహాయం కోసం క్యాబినేట్ ఆమోదించడానికి ప్రతిపాదించామని మైనార్టీ సంక్షేమ శాఖ, ఉపముఖ్యమంత్రి  షేక్ అంజాత్ బాషా బేపరీ తెలిపారు.

హజ్ యాత్ర కోసం విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచే వెళ్లేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గురువారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రవేటు సమావేశ మందిరంలో  "2020 హజ్ - ఆన్‌లైన్ అప్లికేషన్" విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఉప ముఖ్యమంత్రి షేక్ అంజాత్ బాషా బేపరీ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పం వల్లే ముస్లింల కల నెరవేరిందన్నారు.  ముస్లిం మైనారిటీలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో 2020 హజ్ యాత్ర విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి సాధ్యమౌతొందని తెలిపారు.

హజ్ యాత్రికులు పూర్తి స్థాయిలో శిక్షణ పొందితే చాలావరకు సమస్యల్ని అధిగమించవచ్చని డిప్యూటీ సి.ఎం. అభిప్రాయపడ్డారు. సేవా దృక్పథంతో హజ్ యాత్ర వలంటీర్లు ఎంతో భాద్యతతో వ్యవహరించాలన్నారు. అక్కడి యాత్రికులతో నిరంతరం సంప్రదించాలన్నారు.  తద్వారా వారిలో నిబ్బరాన్ని పెంచ గలుగుతామన్నారు.

కనీసం రోజులో ఒక్కసారి అయినా వారితో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకోండని డిప్యూటీ సిఎం తెలిపారు.  మన బాగోగులు చూడడానికి ఒకరు ఉన్నారనే భరోసా ఇవ్వవలసిన భాద్యత వలంటీర్లుపై ఉందన్నారు. ముస్లింలు ముఖ్యంగా నమాజ్ చేసుకుంటారని, అందుకు  ఆనుగుణమైనా అక్కడి మార్గదర్శకాలు తెలపాలన్నారు.

2020 హజ్ యాత్ర దరఖాస్తు అక్టోబర్ 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  దరఖాస్తు చేసుకునేందుకు  గడువు నవంబర్ 10తో  ముగుస్తుందని డిప్యూటీ సిఎం తెలిపారు.  గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సులువుగా కొనసాగడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున హజ్ యాత్రకు వెళుతున్నారని, ఐతే లక్ష్యంకు అనుగుణంగా దరఖాస్తులు రావడం లేదన్నారు. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటేనే అనుగుణంగా కోటా పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో భాగంగా ఏవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలో పవర్ పాయింట్ ద్వారా వివరించారు.

http://www.hajcommittee.gov.in  లో న్యూ యూజార్‌గా లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నారు. ఏవిధమైన పత్రాలు, ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్, ఆధార్, చిరునామా, ఫోటోలు, ఏ కేటగిరిలో యాత్ర లో పాల్గొననున్నారో, పూర్తి వివరాలు తెలపాల్సి ఉందన్నారు. హజ్ యాత్రకు వెళ్ళే  రెండు ఏళ్ళు లోపు  వారిని చిన్నారులుగా పరిగణిస్తారని, అంటే 9 - 9 - 2020 చివరి తేదీగా పరిగణలోకి తీసుకుని,  ఈ తేదీ లోపు వయస్సు రెండేళ్ళు ఉండాలి. ఎన్ ఆర్ ఐలు తమ పాస్ పోర్ట్  నిర్దేశించిన తేదీ లోగా  దాఖలు చేయాలన్నారు. 

 
70 ఏళ్ళు పైబడిన వారు రిజర్వ్ క్యాటగిరి కిందకి వస్తారని,  ఆ కేటగిరి  వారు  జూన్ 1వ తేదీ 1950 కంటే ముందు పుట్టిన వారై వుండాలన్నారు.  మే 31 , 2020కు 70 ఏళ్ళు నిండిన వాళ్ళు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 

డ్రా తో  సంబంధం లేకుండా నేరుగా హజ్ యాత్రకు వెళ్ళవచ్చన్నారు. హజ్ కమిటీ ద్వారా కేవలం ఒక సారి మాత్రమే హజ్ చేయడానికి అవకాశం వుందన్నారు.  దరఖాస్తు చేసుకునే వారి పాస్ పోర్ట్ వ్యాలిడిటీ 20 జనవరి 2021 వరకు ఉండాలని తెలిపారు.

హజ్ యాత్ర సందర్భంగా ఆదేశంలో హజ్ యాత్రికుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. హజ్ యాత్రికుల కోసం భారత ప్రభుత్వం సరళీకరణ విధానంలో పాస్ పోర్ట్ జారీ చేస్తున్నారన్నారు.పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలోను ప్రధాన పోస్ట్ ఆఫీసు ల ద్వారా హజ్ యాత్రికుల పాస్ పోర్ట్ జారీకి చర్యలు చేపట్టారన్నారు.

సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, వక్ఫ్ సర్వే స్పెషల్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ , ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శ్రీనివాసరావు,  జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి  ఎండి రియాజ్ సుల్తానా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వున్న హజ్ సొసైటీల ప్రతినిధులు, 2018, 2019లో హజ్ వాలెంటీర్లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవాణాశాఖలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి