రోను తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి ఒడిషా వైపు మీదుగా బంగ్లాదేశ్కు కదిలిపోతోంది. దీంతో రాష్ట్రంపై రోను తుఫాను ప్రభావం లేకుండా పోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుఫాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది.
గంటకు 17 కిలోమీటర్ల వేగంతో.. ఉత్తర ఈశాన్యం దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ముందస్తు అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం 5.30 గంటలకు ఏపీ తీరంలోనే తీవ్ర తుఫానుగా మారుతుందని భావించారు. అయితే ఇది.. ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ఒడిశా తీరంవైపు వెళ్లిపోవడంతో... దక్షిణ కోస్తాకు వర్ష సూచన లేకుండా పోయింది.