విజయవాడ: ఆంధ్రప్రదేశ్ విభజన అయినా ఇంకా పోలీసుశాఖలో విభజన పూర్తిగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీస్శాఖకు చెందిన చాలా సంస్థలు హైదరాబాద్లోనే ఉన్నాయని, రాష్ట్రానికి ఇంకా 3 వేల మంది ఏపీఎస్పీ సిబ్బంది రావాల్సి ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు నేరాలను తగ్గించాం. రెండేళ్లలో సాంకేతికత ఉపయోగించి నేరాలను అదుపు చేశాం... శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. పోలీస్ అకాడమీ, ఆక్టోపస్, ఏపీఎస్పీ శిక్షణ కేంద్రాలు నిర్మించుకోవాలి. రాష్ట్ర పోలీస్శాఖలో 14 వేల ఖాళీలు ఉన్నాయి. తొలి విడతలో 6వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా నియామకమయ్యే సిబ్బందికి అనంతపురంలో శిక్షణ ఇస్తాం. కృష్ణ పుష్కరాల బందోబస్తుకు 33 వేల సిబ్బంది కావాలని కోరాం అని జె.వి.రాముడు చెప్పారు.