ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఏడుగురు నిందితులకు అవినీతి నిరోధక శాఖ కోర్టు (ఏసీబీ కోర్టు) షాకిచ్చింది. ఈ నిందితులందరికీ రిమాండ్ను పొడగించింది. నిందితుల ప్రస్తుత గడువు మంగళవారంతో ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి జూన్ మూడో తేదీ వరకు రిమాండ్ పొడగించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను సిట్ అధికారులు మంగళవారం ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తును పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన కోర్టు.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఈ క్రమలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమితి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తి మేరకు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, మానవతా దృక్పథంతో అరంగట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు.