Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదాయాన్ని అందించే న‌గ‌రం లేక... ఆంధ్రప్ర‌దేశ్ కుదేలు...

ఆదాయాన్ని అందించే న‌గ‌రం లేక... ఆంధ్రప్ర‌దేశ్ కుదేలు...
విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (17:21 IST)
టైమింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రాష్ గురించి మన ఆంధ్రా ఆర్థికశాఖ అధికారులు, ఆంతరంగిక సమావేశంలో ఆవేశంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశ ఎకనామిక్స్ టైంస్ వార్తా కథనం కూడా ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది. 
 
 
అత్యున్నత ఆర్థిక శాఖ అధికారి మాట్లాడుతూ, ఆర్థిక పతనం అనివార్యం, కానీ ఎప్పుడు అనేదే గానీ.. వేరే ప్రశ్న లేదు అని చెప్పారట. రాజకీయం కోసం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చ లేదు, వృద్ధుల పెన్షన్లు ఇవ్వలేదు గట్రా ఆరోపణలతో నిందించుకోవచ్చు. కానీ ఇది సమయం కాదు. 
 
 
ఇంత వరకు దేశ చరిత్రలో శాంతి భద్రతలు కట్టుదప్పో, రాజకీయ కారణాలతో రాష్ట్రపతి పాలన పెట్టారు కానీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణం చూపి, ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టలేదు, మన రాజ్యాంగంలో వున్నాగానీ. ఇప్పుడు ఆ ఆర్థిక పతనం కారణంతో రాష్ట్రపతి పాలన పెడితే, ఆంధ్రాకు కోలుకోని దెబ్బ త‌గులుతుంద‌ని పేర్కొంటున్నారు.  
 
 
రాష్ట్రాలు చేసే అప్పులకు కేంద్ర అనుమతులు తప్పదని ఆర్‌బిఐ ఆదేశాలు. అప్పుడప్పుడూ పరిమితులు పెంచుకొనే సౌలభ్యం ఇస్తూ పోతుంది కేంద్రం. రాష్ట్రం చెప్పే ఆదాయాల అంచనాలను & అత్యవసర పరిస్థితులను గట్రా చూసి. ప్రతి రాష్ట్రం అప్పుకూ దేశ సార్వభౌమత్వం ముడిపడి వుంటుంది. అంతర్జాతీయ సంస్థలు, దేశాలు, బ్యాంకులు అప్పులు తీర్చమని అంతర్జాతీయ కోర్టులకు వెళితే దేశం సమాధానం చెప్పాలి మొదట. 
 
 
అప్పులు చేసి, ఇచ్చిన గ్రాంటులను మళ్లించి, కేపిటల్ ఎక్స్పెండీచర్ పెట్టకుండా, పనికిమాలిన ఓట్ల పథకాలకు మళ్లించారా అంటే కాగ్ నివేదికలు ఔనని అంటున్నాయి. వాటి గురించి ఇంతకు ముందే వైకాపా ఎంపీ & ప్రతిపక్షం ఫిర్యాధులు చేసి వున్నారు. వాటి మీద ఆరాలు మొదలయ్యి, విషయం తెలిసి ముసుగులో గుద్దులాటల లెక్క, కేంద్ర ఆర్థిక శాఖ వద్ద పంచాయితీలు నడుస్తున్నాయి. 
 
 
అన్నింటికీ మించి, గవర్నర్ పేరు వాడి, ఆయనకు తెలవకుండా, తెచ్చిన అప్పు మీద ఆయనకు కేంద్రం నుండి శ్రీముఖాలు రావడం, ఆయన ఇక్కడి అధికారులను పిలిపించి అడగడం, హైరానా పడుతూ ఆహ్వానం చెయ్యడానికని, జగన్ ఆయన దగ్గరకు వెళ్లి మంతనాలు జరపడం గట్రా చక చకా జరిగాయి. గవర్నర్ స్వరాష్ట్రం ఒడిశ్శాకు వెళ్లి అక్కడి సిఎంతో  సహకారం అనే ముచ్చట్లూ జరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద బుగ్గన వున్నారు. పీయూష్ గోయల్ వద్దకు, మరో మంత్రి గౌతం రెడ్డి వెళ్లారు. 
 
 
కేంద్రం ఆంధ్రాకు ఏదన్నా మేలు చేసేది అయితే, ఆర్థిక స్థితి కారణం చెప్పి, రాష్ట్రపతి పాలన పెట్టకుండా,  నాయుడు ఫిర్యాదు అని ఆయన్ని బలిపశువును చేసి, శాంతి భద్రతలో గట్రా కారణం చూపి విధిస్తే ఆంధ్రాకు మంచిది. దేశ చరిత్రలో ఇంతటి హీన ఆర్థిక పతనానికి ఒక రాష్ట్రాన్ని నెట్టి దిగిపోయే నేతగా చరిత్ర హీనుడుగా మిగిలే పరిస్థితి జగన్ కు తప్పుతుంది. 
 
 
అనివార్యమైన ఫైనాన్షియల్ క్రాష్ త్వరగా చేసుకొంటే మంచిది. ఎందుకంటే, ఇదీ పరిస్థితి అని తెలవని ఉద్యోగులు పీఆర్సీ, డిఏలు గట్రా ఆశలు పెంచుకొంటున్నారు. పెన్షన్లు గట్రా ఇంకా పెంచుతారని జనం అనుకొంటున్నారు. పెంచిన పన్నులు, ఇంకా పెంచే పన్నులు, అప్పుల వడ్డీలకు, రోజువారి, నెల వారీ జీతభత్యాలకు మొదలగు వాటికి సరిపోవు. ఆస్తులు అమ్మాలి. కొనడానికి దివాళా రాష్ట్రం అంటే, ఇంకా తక్కువ విలువకు అడుగుతారు. అవీ పోతే, వచ్చే పెట్టుబడులకు, వడ్డీలకు చేసే అప్పుల తాకట్టులకు కూడా మిగలవు. 
 
 
వృధా పథకాలు ఆగాలి. దానిని ఆపడం అంటే పాలక పార్టీకి ఆత్మహత్యాశదృశ్యం కాబట్టి ఆపలేదు. ముందుకు వెళ్లడం అంటే మరింత ఊబి. జీత భత్యాల నుండి కోతలు మొదలెట్టి, సలహాదారుల మంద, అనవసర వాలంటీర్ వ్యవస్థా గుదిబండ, గ్రామ సచివాలయాల ఎక్స్‌ట్రా లగేజీలు మొత్తం దింపడానికి, పనికిమాలిన ఓట్ల పథకాలను రద్దు చేయడానికి,  రాష్ట్రపతి పాలన పెట్టి, గాడిన పెట్టడం అనివార్యం. 
 
 
ఈ మార్గం అత్యవసరం కాబట్టి, లేటు చేసే కొద్ది, గుదిబండలుగా మారి, దేశ సార్వభౌమత్వం మీద దెబ్బగా మారకుండా, గౌరవంగా ఆరు నెలల రాష్ట్రపతి పాలనతో మొదలెట్టి, కనీసం ఏడాది నుండి రెండేళ్లు జనం చేత ఉచితాలు మానిపించి, చేపను ఉచితంగా తీసుకోవడం కాదు పట్టడం నేర్చుకోవడంలో బతుకు గౌరవం వుందనే వాస్తవాన్ని నేర్పి, మౌలిక వసతుల కోసం గట్రా కేంద్రం నిధులు ఖర్చుపెట్టి, ఆంధ్రాను ఇతోధికంగా ఆదుకొంటే తప్ప, లేచి నిలబడలేదు.
 
 
దేశంలో ప్రతి రాష్ట్రానికీ అంతో ఇంతో ఆదాయం ఇచ్చే రాజధానులు వున్నాయి. అది కూడా లేని ఆంధ్రా మద్యం, పన్నులను పంటి బిగువున భరిస్తూ, ఓట్ల పథకాల పల్లకీని మోస్తూ, పాతాళం కొత్త లోతులు చూడకుండా, మనసులకు సర్ధి చెప్పుకొని, మానసికంగా సిద్ధపడడం అత్యవసరం, అనివార్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్థానిక సంస్థల ఎన్నికలల్లో వేలికి సిరా ఇలా...