ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. వీటిని ఏపీ విద్యామంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. ఇటీవల వెల్లడైన తెలంగాణ టెన్త్ ఫలితాల్లో మాదిరిగానే ఏపీలో సైతం బాలికలు సత్తా చాటారు. బాలికల్లో 91.71 శాతం, బాలురలో 91.15 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన వివరించారు.
మొత్తం 6,44,961 లక్షల మంది పరీక్షలకు హాజరు కాగా, వారిలో 5,77,019 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 3,645 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు. 145 ప్రభుత్వ పాఠశాలల్లో, 1105 జిల్లా పరిషత్, 20 మునిసిపల్, 124 గురుకుల, 54 సాంఘిక సంక్షేమ, 80 ఎయిడెడ్ పాఠశాలల్లో, 2055 ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈ దఫా కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి 98.54 ఉత్తీర్ణతను సాధించగా, చిత్తూరు జిల్లా 71.29 శాతంతో ఆఖరు స్థానంలో నిలిచిందని చెప్పారు. 4,680 మందికి 10/10 జీపీఏ లభించిందని మంత్రి గంటా తెలిపారు. అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 18 నుంచి జూలై 1 వరకు జరుగుతాయని, వీటికి ఫీజును జూన్ 2లోగా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.