Publish Date: Wed, 09 Jun 2021 (21:14 IST)
Updated Date: Wed, 09 Jun 2021 (21:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 9వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కొత్త కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య మాత్రం కాస్త తగ్గింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 93,511 నమూనాలను పరీక్షించగా.. 8766 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. తాజాగా నమోదైన 8766 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది మృతి చెందారు.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,292 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,64,082కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి.