Publish Date: Sat, 30 Mar 2019 (15:50 IST)
Updated Date: Sat, 30 Mar 2019 (15:51 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారిపోయాయనని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ఛైర్మన్ అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, ఈసారి రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా పోటీచేస్తుండంతో ఫలితాలను అంచనా వేయలేకపోతున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొందన్నారు.
అయినప్పటికీ రాష్ట్ర ఓటర్లు ఎంతో తెలివైనవాళ్లని, ఎవరికి ఓటెయ్యాలో వాళ్లకు బాగా తెలుసన్నారు. సినీ గ్లామర్ అనేది జనాలను సభలను రప్పించడం వరకే పనిచేస్తుందని, ఓట్లు ఎవరికి వెయ్యాలన్నది ప్రజలే నిర్ణయించుకుంటారని అంబికా కృష్ణ స్పష్టం చేశారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు టాలీవుడ్ కళాకారులు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. సినిమా పరిశ్రమ అంతా తెలంగాణలోనే ఉండటం వల్ల ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లు ఒత్తిడిలో ఉన్నారని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవని ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కొందరు ధైర్యంగా నిర్ణయం తీసుకుని తమకు తోచిన పార్టీలకు మద్దతు తెలుపుతున్నారన్నారు.