విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయపై తమ పార్టీ నేతల ఒత్తిడి మేరకు దాడి జరిగిందని, ఇలా దాడి చేయడం తప్పేనని వైకాపాకు చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అయితే, ఈ దాడి గురించి తనకు తెలియదని, దాడి జరిగిన రోజున తాను పొలం పనుల్లో ఉన్నానని చెప్పారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆళ్ల పేరును సీఐడీ పోలీసులు 127వ నిందితుడుగా చేర్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో శనివారం ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. తన మిత్రుడుతో కలిసి స్కూటరుపై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఆళ్లను సీఐడీ అధికారులు రెండు గంటల పాటు విచారించారు.
ఈ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాడి జరిగిన రోజు తాను పొలంలో ఉన్న విషయాన్ని అధికారులకు చెప్పానని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. ఘటన జరిగిన ఒక యేడాది తర్వాత ఈ కేసులో తన పేరు చేర్చడం దారుణమన్నారు.
ఈ దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదన్నారు. గతంలో నారా లోకేశ్పై గెలిచినందుకే తనను ఈ కేసులో ఇరికించారన్నారు. 2014-29 వరకు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించానని, అందుకే ఇపుడు రాజకీయ కక్షతో చార్జిషీటులో తన పేరును చేర్చారని చెప్పారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.