Publish Date: Wed, 24 Aug 2022 (20:28 IST)
Updated Date: Wed, 24 Aug 2022 (20:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో కీలక భేటీ జరుగనుంది. ఇందుకోసం ఏపీ ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ భేటీకానున్నారు. ఈ భేటీకి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నారు.
కాగా, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానికి ఏకరవు పెట్టారు. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం సవరించిన అంచనాలు, రాష్ట్ర లోటు బడ్జెట్ను భర్తీ చేసే అంశం తదితర అంశాలపై ప్రధానికి సీఎం జగన్ ఓ వినతి పత్రం కూడా అందజేశారు.
సీఎం జగన్ విన్నపంపై స్పందించిన ప్రధాని మోడీ ఏపీ విభజన సమస్యల పరిష్కార బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్కు అప్పగించారు. దీంతో ఆయన గురువారం ఏపీ ప్రతినిధి బృందంతో ప్రత్యేకంగా భేటీకానున్నారు.