నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకు చెందిన ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్న తల్లి, కట్టుకున్న భర్తలే వ్యభిచారం చేయమంటున్నారన్న ఆవేదనతో ఈమె బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే ఇంజినీరింగ్ చదువుతున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పత్రికల్లో వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ వార్త సంచలనమైంది.
దీంతో సీరియస్గా తీసుకున్న నల్గొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా ఝాన్సీ తల్లి, భర్తతో పాటు స్నేహితులను పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆత్మహత్య చేసుకోలేదని... ఆమె తల్లి, భర్తలే ఆమె చేత పురుగుల మందును బలవంతంగా తాగించి హత్య చేశారని తేలింది. దీంతో ఝాన్సీ తల్లి, భర్తల అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.