శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి సంఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్, తెదేపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అలాగే, కొన్నిచోట్ల తెదేపా కార్యకర్తలు డబ్బులు పంచుతూ పట్టుబడటం మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని వెల్లడించారు.
నియోజకవర్గం వ్యాప్తంగా 76 మేరకు పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవతీపతి మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న టెక్కలిలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మొత్తం 1200 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సమస్యాత్మకంగా ఉన్న 36 ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక స్టేషన్లలో పోలింగ్ సరళిని వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరించారు.