నల్లమల అడవుల్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. సీమాంధ్ర రాజధానికి అనువైన ప్రాంతంగా భావిస్తున్న గుంటూరులో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ జిల్లా పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా, మావోలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు కీలక మావోయిస్టులు పారిపోయినట్టు సమాచారం.
ఈ కాల్పులు గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు వద్ద పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. సంఘటనా స్థలంలో ఎకె 47, ఎస్ఎల్ఆర్, ఇతర సామాగ్రి లభ్యమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టులను జానా బాబూరావు, సారథి, విమలక్కలుగా గుర్తించారు.
పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న జానా బాబూరావు కూడా మావోయిస్టులతో ఉన్నట్టు వినికిడి. ఎదురుకాల్పుల విషయాన్ని ఇటు గుంటూరు జిల్లా ఎస్పీ గానీ, అటు ప్రకాశం జిల్లా ఎస్పీ గానీ ధ్రువీకరించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఈ స్థాయిలో ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం.