Publish Date: Mon, 08 Jul 2024 (09:40 IST)
Updated Date: Mon, 08 Jul 2024 (09:41 IST)
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేసే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, రెండు ఆర్కికెట్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, ఈ కాలేజీలో కొత్త విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వరకు, అత్యల్పంగా రూ.40 వేల వరకు నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుం ఉన్న కాలేజీలు 114 ఉండగా, రూ.లక్ష కంటే ఎక్కువ ఫీజును వసూలు చేసే కాలేజీలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు.
ఈ ఫీజు పరిధిలోనే ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ వస్తాయని పేర్కొంది. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
వరుణ్
Publish Date: Mon, 08 Jul 2024 (09:40 IST)
Updated Date: Mon, 08 Jul 2024 (09:41 IST)