మంత్రి పదవి ఇస్తావా లేదా: బాబును నిలదీసిన లోకేష్- సరేనన్న తండ్రి
ఏపీ మంత్రివర్గంలో చోటుకోసం ఎన్నాళ్ల నుంచో కన్నేసిన నారా లోకేశ్ ఇక ఆగేది లేదని, మంత్రివర్గంలో చోటిస్తావో లేదో చెప్పేయాలని తండ్రిని నిగ్గదీసినట్లు తెలుస్తోంది.
తానెవరికీ భయపడేది లేదని, ఎవరి మాటా విననని, ఏం చేయాలో అదే చేస్తానని పదే పదే చెప్పుకుని తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడి ఒత్తిడికి లొంగిపోతున్నారా? ఏపీ మంత్రివర్గంలో చోటుకోసం ఎన్నాళ్ల నుంచో కన్నేసిన నారా లోకేశ్ ఇక ఆగేది లేదని, మంత్రివర్గంలో చోటిస్తావో లేదో చెప్పేయాలని తండ్రిని నిగ్గదీసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు కుటుంబ సభ్యులు కూడా లోకేశ్కి వత్తాసు పలుకుతూ చేసిన ఒత్తిడికి చంద్రబాబు లొంగిపోయినట్లే అని సమాచారం. ఉగాది పండుగనాడు లోకేశ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం తో మంత్రివర్గంలో వెంటనే చేరిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 19న మంచి ముహుర్తమని, ఆరోజు మంత్రివర్గం లో మార్పులు చేర్పులు చేపట్టాలని తండ్రిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 19వ తేదీన లోకేశ్ నక్షత్రబలం బాగుందని, అదే రోజు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబంలో తీవ్ర తర్జనభర్జనలు సాగాయని, 19వ తేదీన మంత్రివర్గంలో మార్పులు చేయకపోతే తదుపరి తేదీని ఇప్పుడే చెప్పాలంటూ లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు పట్టు పట్టారని సమాచారం.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఉగాది రోజు కేబినెట్లో మార్పులు, చేర్పులు చేపడతా నని, ఉగాది మంచి రోజుని చంద్రబాబు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపడితే ఎన్నికల్లో ఏదైనా జరిగితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన నచ్చజెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునే లోకేశ్కు మంత్రి పదవి ఇచ్చి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీకి చెందిన అత్యున్నత వర్గాలు తెలిపాయి. లోకేశ్కు మున్సిపల్–పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలను ఇవ్వనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న నారాయణను మంత్రివర్గం నుంచి తప్పించి, సీఆర్డీఏ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.