వై.ఎస్. విజయమ్మ రాజీనామాకు ముహూర్తం ఖరారు..!?
పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఏకగ్రీవంగా ఎంపికైన వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేసే యోచనలో పడ్డారని తెలిసింది. తన కుమారుడు కడప ఎంపీ జగన్మోహన రెడ్డిపై అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు నచ్చకపోవడంతో విజయమ్మ తన పదవికి రాజీనామా చేసే నిర్ణయానికి వచ్చినట్లు జగన్ వర్గాల సమాచారం. ఓదార్పు యాత్ర కోసం గతంలో న్యూఢిల్లీకి వెళ్లిన విజయమ్మ, జగన్మోహన రెడ్డిలకు నిరాశే మిగిలిన సంగతి తెలిసిందే. ఇంకా ఓదార్పు యాత్ర, జగన్ వర్గీయులపై అధిష్టానం చిన్నచూపు చూడటంతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మి తన పదవికి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదిలా ఉంటే.. ఓదార్పు మూడోవిడతపై అధిష్టానం ముందుగానే కసరత్తులు మొదలెట్టిందని తెలిసింది. ఓదార్పు యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జగన్ వెంట వెళ్లి గీత దాటుతున్న యువజన నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పాల్గొనని 19 మందికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జె.ఆర్. సుధాకర్ బాబు షోకాజు నోటీసులు జారీ చేశారు.అయితే ఓదార్పులో పాల్గొనవద్దంటూ అధిష్టానం ఆదేశించలేదని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని చెప్పలేదన్నారు.