రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి జె.గీతారెడ్డిపై ముఖ్యమంత్రి కె.రోశయ్యకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. పైరసీపై ఆమె ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా ఈ పైరసీభూతం తెలుగు చిత్రపరిశ్రమను తీవ్రంగా నష్టపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో నిర్మాత దిల్ రాజుతో కలిసి గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.రోశయ్యతో అల్లు అరవింద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు ఒక వినతిపత్రం సమర్పించారు. చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతాన్ని అరికట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా గీతారెడ్డిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు.
మంత్రి గీతా రెడ్డి హామీలకే పరిమితమవుతున్నారేగానీ, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని అరవింద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రోశయ్య.. తాను స్వయంగా పరిశీలిస్తానని అరవింద్కు హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇటీవల విడుదలైన బృందావనం పైరసీ సీడీలు చెన్నయ్లో తయారై మన రాష్ట్రానికి దిగుమతి అయ్యారు. అలాగే, యువహీరో రామ్ చరణ్ నటిస్తున్న ఆరెంజ్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. దీనికి కూడా పైరసీ భయం పట్టుకుంది.