నారా లోకేష్: సవాలు విసిరినా.. కేసీఆర్ ఇంకా ఏం చేస్తున్నారు?
దొంగపుత్రుడు, దత్తపుత్రుడిని చూసుకొని కాంగ్రెస్ పార్టీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అన్నారు. ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా.. టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లో పడుకునే ఉన్నారని నారా లోకేష్ విమర్శించారు.రాష్ట్ర అభివృద్ధి మొత్తం తెలుగుదేశం హయాంలోనే జరిగిందన్నారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన టీఎన్ఎన్ఎఫ్ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ గుర్తు చేశారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ నాయకుడు చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారని... వాటన్నింటిలో ఆయన నిర్దోషిగా బయటపడ్డారని చెప్పారు. కేవలం 39 ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండే రాష్ట్రంలో చంద్రబాబు 600 కాలేజీలు ఏర్పాటు చేశారని నారా లోకేష్ తెలిపారు.