ఆమె జయలలిత కుమార్తె కాదు.. ఆమె మృదంగ విద్వాన్.. చిన్మయి స్పష్టం..
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె ఈమెనంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఓ మహిళ ఫొటో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ జయలలిత కూతురని, సెంట్రల్ యూనివ
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె ఈమెనంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఓ మహిళ ఫొటో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ పలు వాట్సప్ గ్రూపులు, ఫేస్బుక్లలో షేర్ అవుతోంది.
అయితే జయలలిత కుమార్తె ఈమేనంటూ గత కొన్నిరోజులుగా ఫేస్బుక్, వాట్సాప్లలో ఒక ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె త్వరలోనే తమిళనాడు వస్తారని, ముఖ్యమంత్రి పదవి చేపడతారని కూడా కథలు అల్లారు. ఫొటోలోని మహిళకు, జయలలితకు కాస్త పోలికలు ఉండటంతో ఈ వార్త నిజమేనా? అని కొందరికి అనుమానం కూడా కలిగింది. ఇది ఇప్పుడు తాజాగా జరిగిన విషయం కాదు.
జయలలిత 2014లో జైలుకు వెళ్లినప్పటి నుంచీ ఈ ఫొటో చర్చనీయాంశంగా ఉంది. అయితే ఇందులో నిజం లేదని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఫేస్బుక్ వేదికగా తేల్చి చెప్పారు. సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. ఆ మహిళ కుటుంబం తన కుటుంబానికి తెలుసని పేర్కొన్నారు.
‘నవ్వు తెప్పించే ఓ వార్తకు ఈ ఫొటోను జతచేయడం చూశాను. ఈ ఫొటోలోని దంపతులు మా కుటుంబానికి తెలుసు. వారు శాస్త్రీయ సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తులు. చాలా రోజులుగా ఈ పుకారు ప్రచారంలో ఉంది. ఆఖరికి గూగుల్ ఇమేజ్ సెర్చ్లో వెతికినా ఇదే ఫలితం కనిపిస్తోంది. వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందన్న సామెత గుర్తొస్తోంది. దయచేసి అర్థంలేని వార్తలను షేర్ చేయడం ఆపండి.
ఆమె మృదంగ విద్వాన్ వి. బాలాజీ కుటుంబానికి చెందిన వారు. ఆయన కచేరీలతో బిజీగా లేనపుడు ‘హస్బాన్డ్’ అనే వెబ్సిరీస్లో పనిచేస్తారు’ అని చిన్మయి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలను వాడుకోవడం విషయంలో పౌరులకు ఓ చురక కూడా అంటించారు. వాట్సాప్లో ఇలాంటి సమాచారాన్ని షేర్ చేయడానికి ఉపయోగించే సమయంలో సగం సమయాన్ని మంచి పనులకు కేటాయిస్తే మంచిదన్నారు.