అంతర్జాతీయ సంప్రదాయ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ భారత ఉపఖండంలో జరిగే వన్డే ప్రపంచకప్కు తర్వాత పరిమిత ఓవర్ల వన్డే ఫార్మాట్కు కూడా స్వస్తి చెప్పనున్నాడు.
వన్డే ప్రపంచకప్కు తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు శాశ్వతంగా స్వస్తి పలుకుతానని స్వయంగా ముత్తయ్య మురళీధరన్ శుక్రవారం ట్రైనింగ్ సెషన్లో ప్రకటించాడు. కానీ పొట్టి ఓవర్ల ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం కొనసాగుతానని ముత్తయ్య తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో నా టైమ్ ముగిసిపోయింది. ఐపీఎల్లో కూడా రెండేళ్లు ఆడుతానని సంతకాలు చేశానన్నాడు.
38 ఏళ్ల స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఏడాది ఐపీఎల్ నాలుగో సీజన్లో కొచ్చి ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత మూడు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ముత్తయ్య మురళీధరన్, నాలుగో సీజన్ కోసం జరిగిన వేలం పాటలో 1.1 మిలియన్ల మొత్తానికి అమ్ముడుబోయాడు.