Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ప్రకటనతో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న కాంగ్రెస్!!

తెలంగాణ ప్రకటనతో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న కాంగ్రెస్!!
, గురువారం, 22 ఆగస్టు 2013 (15:51 IST)
File
FILE
125 యేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి ఇపుడు 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అనే చందంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనుకూల తీర్మానం చేయడంతో ఆ పార్టీకి కష్టాలు చుట్టిముట్టాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలు చివరకు సొంత పార్టీ సభ్యులను సస్పెండ్ చేసుకునే దుస్థితికి చేరుకున్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ వచ్చారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు వలే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయలేదు. అయినా, వారిని కూడా సస్పెండ్ చేసింది.

నిజానికి ఈ నెల ఐదో తేదీ నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో దాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం అందిపుచ్చుకుంది. తొలి రోజు నుంచే సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ ప్రాంతానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు.

కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదు. ఈ ఆందోళనల వల్ల సభా సమయం వృధా అయిపోతుండటంతో తొలుత టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, కీలకమైన ఆహార భధ్రత బిల్లుకు ప్రతిపక్షాల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ దేనికి దారితీస్తుందో అని ప్రభుత్వం ఓపిక పడుతూ వచ్చింది.

కానీ, చివరికి కీలకమైన బిల్లులుపై చర్చకు కూడా అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ చర్యను ఎన్సీపీ మినహా అన్ని పార్టీలు తప్పుబట్టాయి. దీంతో సభ వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ విషయంలో టీడీపీ సహా ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు రాయబారాలు ప్రారంభించింది. అవి ఫలించలేదు.

ఈ తరహా పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయమే. ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కులే వచ్చినట్లు ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే, సొంత పార్టీ నేతలు సైతం తెగించి ముందుకు వస్తుండటం కాంగ్రెస్‌కు ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది. సస్పెన్షన్ తీర్మానం కారణంగా సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఇంకా కఠినంగా ఉద్యమించడానికి అధిష్టానమే అవకాశం ఇచ్చినట్లుగా మారింది.

ఒక పక్క సీమాంధ్రలో మిన్నంటిన ఉద్యమం, పార్టీపై తీవ్ర ఒత్తిడులు మరోవైపు ఓట్లు కురిపిస్తాయనుకున్న కీలక బిల్లులకు ప్రతిపక్షాల సహాయ నిరాకరణ, ఇంకోవైపు వికటించిన ఆర్థిక చర్యలపై ప్రతిపక్షాల నిలదీతలు, శ్రీలంకకు ప్రధాని వెళ్లడాన్ని నిరసిస్తూ డీఎంకే సభ్యుల ఆందోళన, ఇలా దిక్కుతోచని స్థితిని ప్రస్తుతం కేంద్రంలో అధికార కాంగ్రెస్ ఎదుర్కొంటోందనే చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu