శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో తెలంగాణా ఇవ్వమని చెప్పినా చెప్పకపోయినా తమకు కావలసింది తెలంగాణా రాష్ట్రమని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. ఫిబ్రవరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనూకూలంగా ఉంటే సరేసరి, వ్యతిరేకంగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పనిపడతామని ఆయన హెచ్చరించారు.
అంతేకాకుండా, తన చిరకాల ప్రత్యర్థి వైఎస్ తనయుడు వైఎస్.జగన్తో సైతం చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సైతం ఆయన సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. తద్వారా తెలంగాణలో మనం (తెరాస), సీమాంధ్రలో వైఎస్.జగన్ క్లీన్స్వీప్ చేసి రాష్ట్రాన్ని రెండున్నరేళ్ళు చొప్పున పాలించేలా కేసీఆర్ భవిష్యత్ వ్యూహాలను రచిస్తోన్నట్టు వినికిడి.
ఒకవేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టకపోతే సీమాంధ్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న వైఎస్ జగన్తో చేతులు కలిపేందుకు వెనుకాడబోమని తెరాసకు చెందిన నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఆలోచించుకునేందుకు సంవత్సరకాలం పాటు తెలంగాణా ప్రజలు ఇచ్చారనీ, ఇక అంతకుమించిన సమయాన్ని ఇవ్వలేరని చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోను పూర్తిగా దెబ్బతీసేందుకు జగన్తో చేతులు కలపాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేసీఆర్ వరంగల్లో జరిపిన మహాగర్జనకు వైఎస్ జగన్ పరోక్షంగా మద్దతు ప్రకటించడమే కాకుండా, బహిరంగ సభ నిర్వహణ కోసం రూ.ఐదు కోట్లు కూడా ఇచ్చినట్టు భొగొట్టా. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఇటు తెలంగాణ, అటు వైఎస్.జగన్లు కలిసి కాంగ్రెస్ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా కనిపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే.