ఓటర్లను ప్రలోభ పెడితే యేడాది జైలు : భన్వర్ లాల్
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (13:20 IST)
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడితే ఒక యేడాది జైలుశిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం 6.48 కోట్లు, అందులో పురుషులు 3.26 కోట్లు, మహిళలు 3.22 కోట్లు కాగా, 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 33 లక్షలు ఉన్నట్టు తెలిపారు. దేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక వ్యయానికి అవకాశం ఉందని ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు లెక్కాపత్రం లేని రూ.105 కోట్ల నగదు పట్టుకున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పట్టుకున్న దానిలో ఇది 46 శాతమని ఆయన తెలిపారు. ఓటర్లను ప్రలోభపెడితే ఐపీసీ 171బి - సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని, దీనికి ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. మద్యం అక్రమ తరలింపునకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇక్కడే అత్యధికంగా 29,990 కేసులు నమోదయ్యాయి. 3.92 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. ఓటర్లను ప్రలోభ పెట్టేవారిపై ఫిర్యాదు చేసేందుకు సెంట్రల్ హెల్ప్ లైన్ 1950ను ఏర్పాటు చేశారు.