చేవెళ్ళ భూములు రూ.20 కోట్లు పలికేలా చేస్తా : కేసీఆర్
, ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (11:20 IST)
హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ళ భూములు 20 కోట్ల రూపాయలు పలికేలా చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం హైదరాబాద్లో మరో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెపారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాలీలపై రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు ఫించను ఇస్తామని తెలిపారు. అలాగే, హైదరాబాద్ నగరానికి ఒక ఎయిర్ పోర్టు సరిపోదని, మరో విమానాశ్రయాన్ని తెస్తామన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు హైదరాబాద్ వస్తారని, అప్పుడు చేవెళ్ల భూములు 20 కోట్ల రూపాయల ధర పలకనున్నాయని చెప్పారు. హైదరాబాద్లో సిలికాన్ వ్యాలీ కంటే గొప్ప సాఫ్ట్వేర్ పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు.చైనాలోని హార్డ్ వేర్ పార్కు కంటే గొప్పదాన్ని హైదరాబాద్లో నిర్మిస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు కష్టపడుతున్నందున వారికి రవాణా పన్ను నుంచి విముక్తి కల్పించి, వేధింపులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 'ఇది కేసీఆర్ మాట' అని ఆయన హామీ ఇచ్చారు.