రాజంపేట లోక్సభ టిక్కెట్ పురంధేశ్వరికే :: బీజేపీ వెల్లడి
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (12:16 IST)
ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ ఎన్నికల కమిటీ రాజంపేట లోక్సభ టిక్కెట్ను కేటాయించింది. ఈ సెగ్మెంట్ కడప జిల్లాలో ఉంది. ఈ విషయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు హరిబాబు బుధనారం రాత్రి ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. రాయలసీమ ప్రజలకు ఎన్టీఆర్ కుటుంబంపై ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని, వారి కోరిక మేరకే ఆమెను అధిష్టానం రాజంపేట నుంచి బరిలో నిలుపుతోందని హరిబాబు వివరించారు. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా తనకు దక్కిన నాలుగు పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే నర్సాపురం, విశాఖపట్నం, తిరుపతి లోక్సభ స్థానాలకు అభ్యర్థులను బిజెపి ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా రాజంపేట నుంచి పురందేశ్వరి బరిలో ఉంటారని బీజేపీ ప్రకటించింది. అయితే పురందేశ్వరి మొదటి నుంచి విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అక్కడి నుంచి కాకపోతే విజయవాడ, నర్సరావుపేట స్థానాల నుంచైనా పోటీకి సిద్ధపడ్డారు. కానీ తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు బిజెపికి కేటాయించలేదు.