రాష్ట్ర ప్రజల ఆగ్రహావేశాల కారణంగా రాష్ట్రం అగ్నిగుండంగా మారినప్పటికీ హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహిస్తున్నారని తెదేపా మహిళా నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితిని కేంద్రానికి వివరించాల్సింది ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, చిరంజీవి వంటి వారు కాదని, హోంమంత్రి ఢిల్లీకి వెళ్లి వివరించాలని సూచించారు. ఈ పని కూడా చేయకుండా గాడిదలు కాస్తున్నారా అని హోంమంత్రిని నన్నపనేని ప్రశ్నించారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆమరణ నిరాహారదీక్షలు చేస్తున్న అన్ని పార్టీల నేతలకు ఆమె సంఘీభావం తెలుపుతూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హోంమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తెలంగాణకు మాత్రమే హోంమంత్రిగా అనుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలా భావిస్తే తక్షణం ప్రభుత్వ క్వార్టరు, జీతభత్యాలను వదులుకోవాలని నన్నపనేని డిమాండ్ చేశారు.