పడిపోయిన రూపాయి: 552 పాయింట్లు భారీగా పతనమైన సెన్సెక్స్
బాంబే స్టాక్ మార్కెట్పై రూపాయి మారకం విలువ కొంపముంచింది. మంగళవారం రూపాయి విలువ డాలరుతో పోల్చితే 66కి పడిపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా మంగళవారమంతా తిరోగమనం బాటపట్టిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 552 పాయింట్లు భారీగా పతనమై 18,005 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 177 పాయింట్లు నష్టపోయి, 5,299 పాయింట్ల వద్ద స్థిరపడింది. రూపాయి ప్రభావంతోనే బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంకా సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల మేర పతనమైందని వారు అభిప్రాయపడుతున్నారు.