యూపీఏ కూటమి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో దోహదపడిన గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ పెద్దపీట వేశారు. ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక సాధారణ బడ్జెట్లో ఈ పథకానికి రూ.40,100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
అలాగే, గ్రామ ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అన్న మహాత్ముని మాటలను ఉటంకించిన ప్రణబ్ ముఖర్చీ.. గ్రామీణ అభివృద్ధికి 66,100 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇకపోతే.. కాలుష్యంబారిన పడి తమ పవిత్రతను కోల్పోతున్న దేశంలోని జీవ నదుల ప్రక్షాళకు కూడా మంత్రి నిధులు కేటాయించారు.
ఇందులోభాగంగా, గంగానది ప్రక్షాళనకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, ప్రాథమిక విద్యకు రూ.31,036 కోట్లు, ఇందిరా ఆవాస్ యోజనా పథకానికి రూ.10,000 కోట్లు, తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ టెక్స్టైల్ పరిశ్రమకు రూ.200 కోట్లు, జల విద్యుత్ విధానానికి రూ.5930 కోట్లు చొప్పున కేటాయించారు. వీటితో పాటు.. దేశంలో ఉత్పన్నమయ్యే విద్యుత్ సమస్యల పరిష్కారానికి బొగ్గు గనులను కేటాయించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కోల్ అథారిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.