మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. దేశం ఒక మహోన్నత వ్యక్తిని కొల్పోయిందని అన్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్, బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, దిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు ట్విట్టర్లో తమ సంతాప సందేశాలను పోస్టు చేశారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కలాం మరణం జాతికి తీరని లోటని పేర్కొన్నారు. గొప్ప మానవత్వం ఉన్న మనిషి కలాం అని కొనియాడారు. దేశంలో మిసైల్ మేన్గా కలాం పేరుగాంచారని అన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. కలాం మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్త, దార్శనికుడు, స్ఫూర్తిదాతను కోల్పోయిందని అన్నారు.