బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. కార్గిల్ అమరవీరులకు కేటాయించిన స్థలంలో నిర్మించిన 31 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అలాగే, ఈ స్కాంతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. అయితే, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు భవనం కూల్చివేతపై 12 వారాల పాటు స్టే విధించాలని కౌన్సెల్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది.
వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని మూడు నెలల్లో కూల్చి వేయాల్సిందిగా గత 2011 జనవరి 1వ తేదీన పర్యావరణ శాఖ ఆదేశించినప్పటికీ.. భవనాన్ని కూల్చివేయలేదు. ఈ నేపథ్యంలో కోర్టులో దాఖలైన పిటీషన్ను విచారించిన కోర్టు.. భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూనే.. ఈ అంశంపై మొదట్లోనే స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై విచారణ ప్రారంభించాలని రక్షణ శాఖను కోరింది.
కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలు, ఇతర సైనికుల కోసం ఆదర్శ్ సొసైటీ పేరుతో మొదట ఆరు అంతస్తులు నిర్మించాలని భావించి నిర్మాణాన్ని తలపెట్టారు. అయితే అనంతరం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవనాన్ని కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన మృతుల కుటుంబాల కోసం నిర్మించగా, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు తమ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించుకున్నారు. ఈ స్కామ్ గత 2010లో వెలుగు చూసింది. ఇందులో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవిని కోల్పోయారు.