గత 18రోజులుగా కొనసాగుతున్న చలనచిత్రరంగ బంద్ ఇంకా కొలిక్కి రాలేదు. ఫైటర్ల సమస్యతో ప్రారంభమై నిర్మాతలు బంద్ పిలుపుతో షూటింగ్లు ఆగే దాకా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సమస్యను ఇండియన్ ఫెడరేషన్ కౌన్సిల్ (ఐపెక్) అధ్యక్షుడు తివారీ హైదరాబాద్ వచ్చి ఈ సమస్యపై చర్చలు జరిపాకే తగు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
అన్నట్లు ఆదివారం గోల్కొండ హోటల్లో చెన్నై ప్రముఖులు, హైదరాబాద్ ప్రముఖులతో సమావేశమయ్యారు. అయినా సమస్య తేలలేదు. సోమవారంనాడు నిర్మాతమండలి సమావేశం జరుగుతోంది. 24 శాఖల కార్మికుల సమస్యలు పరిష్కారానికి పట్టుబట్టారు. డైలీ వేజెస్ మొదట్లో అనుకున్నట్లుగా అమలుచేయాలని పట్టుబడుతున్నారు. దీనికి నిర్మాతలు ససేమిరా అంటున్నారు. దీంతో సమస్య మొదటికి వచ్చింది.
హీరోలు అంగీకరించడంలేదు
ఇదిలా ఉండగా, కాస్ట్ఆఫ్ ప్రొడక్షన్ను కంట్రోల్ చేసే భాగంలో హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు చెప్పినా హీరోలు అంగీకరించడంలేదని తెలిసింది. ఇది డిమాండ్ అండ్ సప్లయి మాత్రమే. డిమాండ్ లేకపోతే మీరుఇవ్వమన్నా ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రముఖ హీరో.... మలయాళంలో మమ్ముటి ఇటీవలే మాట్లాడిన సందర్భాన్ని ప్రస్తావించాడు.
మలయాళంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. తన మార్కెట్ కోటిరూపాయలుపైనే ఉందనీ, దానికి తగినట్లుగానే చిత్రాన్ని ప్లాన్ చేసుకోవాలని మమ్ముట్టి సూచించిన విషయాన్ని తెలుగు నిర్మాతలకు హీరోలు సూచించారు. దీంతో హీరోలు తగ్గరనే విషయం స్పష్టమైంది. ఇంకా ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
ఆర్టిస్టులకు సౌకర్యాలు తగ్గించాలి
హీరోల పారితోషికం కంటే నటీనటుల సౌకర్యాలు తగ్గించుకోవాలని కొందరు సూచించారు. దాంతో షూటింగ్లో ఉపయోగించే కారవాన్ (హీరోహీరోయిన్లు, సీరియర్ ఆర్టిస్టులకు ఉపయోగించే ఎ/సి వ్యాన్లు) ఉపయోగించకుండా సాధారణ సౌకర్యాలు కల్పిస్తే లక్షలాది రూపాయలు ఆదా అవుతుందని చర్చల్లో వచ్చింది.
మరోవైపు పరభాషా నటీనటులు వస్తే వారి విమానయాన చార్జీలు, లాడ్జింగ్, బోర్డింగ్ అంతా వారే చూసుకునేట్లుగా అందులోనే రెమ్యునరేషన్ ఫిక్స్ అయ్యేట్లుగా చూడాలనేది మరో చర్చ.. ఇలా ఒక పక్క పరిష్కారం కాకపోతే మరో పక్క లొసుగులు వెతుకుతున్నట్లుగా చర్చలుసాగుతున్నాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.