మరాఠా రాజ్యాన్ని మొఘలుల నుంచి రక్షించిన ధీర వనిత మహారాణి తారాబాయి. ఛత్రపతి శివాజీ తనయుడు రాజారాం ధర్మపత్ని తారాబాయి. మొఘలుల దాడులను నుంచి రాజ్యాన్ని రక్షించటానికి సతారాను రాజధానిగా చేసుకుని పరిపాలించింది తారాబాయి.
మహారాణి తారాబాయి 1675లో జన్మించింది. చిన్నప్పటి నుంచే తారాబాయి తెలివైనది కావటంతో విద్యతో పాటుగా ఇతర క్రీడలను నేర్చుకుంది. కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో రాణించింది. తారాబాయిని మహారాష్ట్రీయులు భద్రకాళిగా పిలుస్తారు.
మహారాజా ఛత్రపతి శివాజీ తనయుడు రాజారాంకు తారాబాయిని ఇచ్చి వివాహం చేశారు. దాదాపుగా అదే సమయంలో ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సాహూను మొఘలులు బంధించి షరతులతో విడుదల చేశారు. పీష్వా బాలాజీ విశ్వనాధ్ సాయంతో కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించాడు సాహూ. దీనితో తారాబాయి కొంత కాలం తెరమరుగైంది.
సాహూకు పోటీగా కొల్హాపూర్లో ప్రతి కోర్టును తారాబాయి ఏర్పాటుచేసింది. భర్త రాజారాం, సాహూలు మరణించిన తర్వాత పెంపుడు కొడుకు రామరాజు పేరుతో తారాబాయి ఆ రాజ్యానికి 1749లో మహారాణి అయింది తారాబాయి. మహారాణి పదవిని చేపట్టిన తర్వాత తారాబాయి మహారాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసింది.
తారాబాయి గుర్రపు స్వారీలో దిట్ట. దానితో ఆమె రాజ్య రక్షణ కోసం ఆశ్విక దళాన్ని ఏర్పాటుచేసింది. ప్రత్యర్ధులతో వ్యూహాత్మకంగా దాడులు చేసి రాజ్యాన్ని రక్షించిన యోధురాలు తారాబాయి. మొఘలుల భరతం పట్టిన మరాఠా మహిళ తారాబాయి. తారాబాయి నేతృత్వంలోని మరాఠా సేనలు నర్మదా నదిని దాటి మాళ్వా ప్రాంతంలో మొఘలు సేనలను ఓడించారు. తారాబాయి విజయంలో సేనా నాయకులు ఉదయ్జీ పవార్, హైబత్రావు నింబాకర్లు కీలకపాత్ర పోషించారు.
తారాబాయి సేనల ధాటికి మొఘలులు మహారాష్ట్రను వదిలి వెళ్లాయి. ఇదే సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అహ్మద్నగర్లో కన్నుమూశాడు. ఆ తర్వాత కాలంలో మరాఠా సామ్రాజ్యం పీష్వాల వశం అయింది.