రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తన పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తెల్లవారు జామున 4 గంటలకు తిరుమల శ్రీవారి అర్చనలో పాల్గొన్నారు. జూలై 7వతేదీ తన పెళ్లిరోజు కావడంతో ఆమె కుటుంబంతో సహా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.
దర్శనానంతరం పద్మావతి అతిథి గృహంలో కుటుంబంతో కలిసి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటారు. కాగా సోమవారం తెల్లవారు జామున వేదపండితులు ఆలయ మర్యాదలతో 73 ఏళ్లు నిండిన రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పడి ఇప్పటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా తిరుమలలో నాలుగు రోజులు పాటు జరిగే అమృతోత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ మహద్వారం వద్ద ఎస్వీ భక్తి ఛానెల్ను రాష్ట్రపతి నేడు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంతంగా ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక భక్తి ఛానెల్ ఈ ఉగాది పర్వదినం నుంచి టెస్ట్ సిగ్నల్స్తో నడుస్తుండటం తెలిసిన విషయమే.
ప్రతిభా పాటిల్ జీవిత వివరాలు
మహారాష్ట్రలోని నద్గావ్లో 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన నారాయణ్ పగ్లూ దంపతులకు జన్మించిన ప్రతిభా పాటిల్, పాఠశాల చదువు జలగావ్లోని ఆర్ ఆర్ పాఠశాలలో కొనసాగింది. ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న జల్గావ్లోని మూల్జీ జైతా కళాశాల నుండి ఎం.ఏ పట్టాను, ముంబాయి ప్రభుత్వ న్యాయ కళాశాలనుండి లా డిగ్రీని పొందిన ప్రతిభా పాటిల్, కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో బాగా రాణించడమే గాక, అనేక అంతర్-కళాశాల పోటీలలో గెలుపొందారు.
1962లో, ఎం.జె.కళాశాల తరపున "కాలేజ్ క్వీన్"గా ఎన్నికైంది. అదే సంవత్సరం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఈమె 1965, జూలై 7న ప్రముఖ విద్యావేత్త దేవీసింగ్ రణ్సింగ్ షెకావత్ను వివాహమాడారు. ఈ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.
భారత జాతీయ కాంగ్రేసు సభ్యురాలైన పాటిల్ను అధికార పక్షమైన జాతీయ ప్రజాతంత్ర కూటమి మరియు వామపక్షాలు అధ్యక్ష పదవికి తమ అభ్యర్ధిగా నిలబెట్టాయి. 2007 జూలై 19న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పాటిల్ తన సమీప ప్రత్యర్థి అయిన భైరాం సింగ్ షెకావత్పై 3,00,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి మరియు మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి అయిన ప్రతిభా పాటిల్ భారతదేశ 12వ రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. 2007, జూలై 25 తేదీన ఈమె అబ్దుల్ కలామ్ నుండి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాటిల్, 1962 నుండి 1985 వరకు జల్గావ్ జిల్లాలోని ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 1986 నుండి 1988 వరకు రాజ్యసభ డిప్యుటీ ఛైర్మెన్గా, 1991 నుండి 1996 వరకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గమునుండి లోక్సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు.
కాగా, 2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ మరియు తొలి మహిళా గవర్నరుగా ప్రతిభా పాటిల్ పనిచేశారు.