గతవారం కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ 19వ వార్షికోత్సవం జరిగింది. ఆ సందర్భంగా పాత్రికేయ వృత్తిలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి వాస్తవాలను వెలికి తీసిన మహిళా జర్నలిస్టులకు కరేజ్ ఇన్ జర్నలిజం అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డు గ్రహీతలలో ఒకరైన కింబర్లీ రోజియేర్, ఆప్ఘన్ జర్నలిస్టు ఫరీదా నెఖాడ్ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని లక్ష్యాలను ఛేదించగల తెగువ, సమయస్పూర్తి ప్రతి మహిళలోను ఉంటాయని అన్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించడంలోనే మన విజయం దాగి ఉందని వారు పేర్కొన్నారు.
అయితే మహిళా జర్నలిస్టులకు విజయాలు అంత తేలిగ్గా రావటం లేదు, వార్తా సేకరణలో భాగంగా వారు ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా చిక్కుకోవలసి వస్తోంది. ఉదాహరణకు ఈ అవార్డుకు ఎంపికైన ఆప్ఘన్ జర్నలిస్టు ఫరీదా నెఖాడ్ తీవ్రవాదులనుంచి పలుసార్లు బెదిరింపులకు గురైంది, తన తోటి జర్నలిస్టు సహచరులు ఎందరో తన కళ్లముందే కాల్పులకు గురై చనిపోవడం ఆమె చూసింది. అయితే పాజ్ వర్క్ ఆప్ఘన్ న్యూస్ స్వతంత్ర ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఫరీదా ఆప్ఘనిస్తాన్లో పత్రికా స్వేచ్ఛ, మహిళా హక్కులకోసం మాతృభూమిలో పోరాటం సాగిస్తూనే ఉంది.
తాలిబాన్ల పతనం తర్వాత ఆప్ఘన మహిళల పరిస్థితి కాస్తంత మారిందని ఆమె చెప్పారు. రేడియో, టెలివిజన్, మీడియా రంగాల్లో ప్రారంభంలో మహిళలకు అవకాశాలు ఒక మేరకు దక్కాయని అయితే మహిళల భద్రతా సమస్యలు ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారయ్యాయని ఫరీదా చెప్పారు. సగటు మహిళలకు మల్లే ఆప్ఘన్ మహిళా జర్నలిస్టులు పలు రంగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు.
ఆప్ఘనిస్తాన్లో ఇప్పటికీ కొనసాగుతున్న బలవంతపు వివాహాల గురించి రాయాల్సివస్తే మహిళా జర్నలిస్టులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సిందే అని ఫరీదా అంటారు. 12 లేదా 13 సంవత్సరాలు నిండని బాలికలు 50, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులను వివాహమాడిన సంఘటనలను మహిళా రిపోర్టర్లు రాయవలసి వస్తే పాలక వ్యవస్థ ఏ మాత్రం సహించడం లేదని చెప్పారు.