వినాయకుని వివాహమునకు అనేక చరిత్రలున్నాయి. అందులో ఓ కథనం ప్రకారం విఘ్నేశ్వరునకు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు సతీమణులున్నట్లు ప్రతీతి. కనుకనే వినాయకుడు కొలువైన చోట సకల కార్యాలూ సిద్ధిస్తాయని శాస్త్ర కారుల విశ్వాసము.
సిద్ధి, బుద్ధి మహాత్మ్యం చేత జ్ఞానం వికసిస్తుందని, అందుచేత పూజ, వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యముల ప్రారంభానికి ముందు వినాయకుని పూజతోనే మొదలవడం శాస్త్రోక్తం. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు. ఇకపోతే విఘ్నేశ్వరుని వివాహంపై మరికొన్ని గాథలు ఆయన బ్రహ్మచార్య వ్రతాన్ని కైగొన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.
కాకిరూపంలో గజనాథుడు!
అగస్త్యమహర్షి ఒకసారి కోపించి కావేరీనదీ జలాలను తన కమండలంలో బంధించివేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి, దేవేంద్రుడు గణపతితో మొరపెట్టుకోగా, ఏకదంతుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని త్రాగినట్టు చేసి కమండలాన్ని దొర్లించి ఎగిరిపోతాడు.
దీనితో కమండలములోని కావేరీ మాత ఏరులై పారుతుంది. మళ్ళీ యథావిధిగా కావేరి నది మామూలుగా ప్రవహించసాగింది. తన తొందరపాటును తెలుసుకుని అగస్త్యుడు వినాయకుని స్తుతించడం జరుగుతుంది. ఈ గాథ తమిళనాట ప్రచారంలో ఉంది. తమిళ భాషపై గొప్ప పాండిత్యం గల అగస్త్య మహామునికి ఆగ్రహం సరికాదని విఘ్నేశ్వరుడు ఈ కథ ద్వారా జ్ఞానోదయం చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.