కైలాసంలోని గణాలకు అధిపతిగా మహేశ్వరుడు చవితి నాడు వినాయకుడిని నియమించాడు. ఆ రోజు భూలోకంలోని ప్రజలు ఉండ్రాళ్లు, కుడుములు, బూరెలు తదితర పిండివంటలు చేసి వినాయకుడికి నైవేద్యం పెడతారు. ఆ పిండివంటలను వినాయకుడు ఆరగించి కొన్ని తన వాహనమైన మూషికాసురుడికి ఇచ్చి కైలాసానికి తిరిగి వచ్చాడు.
తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించేందుకు వంగబోయాడు. అయితే భుక్తాయాసం కారణంగా వంగలేక తంటాలు పడ్డాడు. అది చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు ఫకఫకా నవ్వాడు. దీనితో దిష్టి చేత వినాయకుడు పొట్ట పగిలి మూర్ఛపోయాడు. ఇది చూసిన పార్వతి ఆగ్రహంతో చంద్రుని శపించింది. ఏ అందం చూసి నువ్వు విర్రవీగుతున్నావో ఆ అందం నీకు నశిస్తుందని శపించింది. అంతే కాదు నిన్ను చూసిన వారు నీలాపనిందలకు గురయ్యెదరని శపించింది.
చంద్రుని కాంతి నశించడంతో భూలోకం చిమ్మచీకటయిపోతుంది. దీంతో కలవరపడిన మునులు, మిగిలిన దేవతలు పార్వతి వద్దకు వెళ్లి శాపవిమోచనము మార్గము అడిగారు. అప్పటికి శాంతించిన పార్వతి దేవీ పక్షం రోజులు మాత్రమే చంద్రుడు తన కాంతిని ప్రసరిస్తాడని చెప్పింది. అప్పటి నుంచి నెలలో పక్షం రోజుల మనకు అమావాస్య. మిగిలిన రోజులు పౌర్ణమి అన్నమాట.